వెంకటేశ్, శ్రీదేవి జంటగా ఆర్జీవీ దర్శకత్వంలో 1990లో వచ్చిన క్షణక్షణం సినిమాలో ‘జామురాతిరి.. జాబిలమ్మా.’. అనే పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్. ముప్పై ఏళ్ల గడుస్తున్నా ఈ పాట మాధుర్యం ఇంకా తగ్గలేదు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఈ పాటను కీరవాణి టీమ్ “జామురాతిరి.. రీ కిండిల్డ్” పేరుతో వీడియో రూపంలో ఈ పాటను షూట్ చేశారు. ఈ పాటను ఆర్జీవీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి అభినందించారు.

 

 

పృద్వీ చంద్ర దర్శకత్వంలో ఈ పాటని అమెరికాలోని సాన్ జోస్‌లో చిత్రీకరించారు. కాళ భైరవ, హేమచంద్ర, మనీషా, దీపు, దామిని, మౌనిమ, శృతి, నోయల్‌, పృధ్వీ చంద్ర కలసి ఆలపించారు. ఆహ్లాదకర వాతావరణంలో, చక్కని హమ్మింగ్ తో ఈ పాటను షూట్ చేసిన తీరు అద్భుతం. నేటి తరానికి ఈ పాట గొప్పదనాన్ని, అందాన్ని కళ్లకు కట్టారు. ఒరిజినల్ క్షణక్షణం మూవీలోని ఈ పాటలో వెంకటేశ్, శ్రీదేవి అభినయం చూసిన వాళ్లకు వెన్నెల హాయిని తలపిస్తుంది. ఎటువంటి ఎక్స్ ప్రెషన్స్ లేకుండా ఫీల్ కు తగ్గట్టుగానే తమ హావభావాలు పలికించి పాట అందం పెంచారు. పాటకు తగ్గ మూడ్ క్రియేట్ చేయడంలో ఆర్జీవీ టేకింగ్ అమోఘం.

 


దీనిని కీరవాణి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. “ఈ సాంగ్ రికార్డ్ చేసినప్పుడు ఈ యువ సింగర్స్ లో కొందరు ఇంకా పుట్టలేదనుకుంటున్నా. సన్నివేశానికి తగ్గట్టుగా సిరివెన్నెల గారు ఈ పాట రాసి ఆర్జీవీని ఒప్పించారు. మరచిపోలేని జ్ఞాపకం” అంటూ రాసుకొచ్చారు. కొన్ని సినిమాలు, పాటలు, సన్నివేశాలకు లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉండి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ గా మిగిలిపోతాయి.  అవి క్లాసిక్స్ కావచ్చు, కమర్షియల్ కంటెంట్ కావొచ్చు. మన తెలుగు ఇండస్ట్రీలో ఇటువంటివాటికి కొదవలేదు. నటులు, టెక్నీషియన్ల ప్రతిభకు అవి గీటురాయిగా నిలుస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: