తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి , సంక్షేమ పథకాలన్నీ అవినీతిమయమయ్యాయని వైకాపా అధికారంలోకి రాగానే వాటిని నిలిపివేయడమో, రద్దు చేయడం చేస్తోంది . పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు పనులను రద్దు చేసిన జగన్ సర్కార్ , విద్యుత్ ఒప్పందాలను సమీక్షించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే . అదే ఊపులో పేదలకు అన్నం పెడుతున్న అన్నా క్యాంటీన్ల ను కూడా మూసి వేయాలని నిర్ణయించింది. అన్నా క్యాంటీన్లను మూసివేయాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ... బూమరాంగ్ అయినట్టుగా కనిపిస్తుంది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు దాదాపు రెండున్నర లక్షల మంది పేదల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్ల మూసివేయాలన్న ప్రభుత్వ నిర్ణయం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 13 జిల్లాలోని 204 అన్న క్యాంటీన్లను వైకాపా ప్రభుత్వం జూలై 31 వ తేదీ అర్ధరాత్రి నుంచి మూసివేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అన్నా క్యాంటీన్లపై ఆధారపడి ఎంతోమంది మధ్యతరగతి జీవులు , నిరుద్యోగులు తమ ఆకలిని తీర్చుకుంటున్నారు. అన్న క్యాంటీన్లలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజనాన్ని కేవలం ఐదు రూపాయలకే అందించేవారు . 2018 లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హరే కృష్ణ చారిటబుల్ ట్రస్టు అద్వర్యం లో నడిచే అక్షయ పాత్ర చారిటబుల్ ట్రస్టు సహకారం తో రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటిన్లను ఏర్పాటు చేశారు . ఈ క్యాంటిన్లపై ఆధారపడి ఆకలిని తీర్చుకునేవారు ఎంతోమంది ఉన్నారు.
ముఖ్యంగా అమరావతి నగర పరిసరాల్లో ఏర్పాటుచేసిన అన్న క్యాంటిన్ల కు ఎనలేని డిమాండ్ ఉండేది . అమరావతి నిర్మాణ పనుల్లో పాల్గొనే మేస్త్రీలు, కార్మికులు , పెయింటర్లు, నిరుద్యోగ యువత , సామాన్య , మధ్యతరగతి ప్రజలు ఒక్కరేమిటి చాలామంది అన్న క్యాంటీన్లలో ₹5 భోజనం భుజించి తమ కడుపు నింపుకునేవారనే నిర్వివాదాంశం . అయితే జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వల్ల వారంతా అర్ధాకలి తో అలమటించాల్సిన దుస్థితి నెలకొంది .