ఆరోగ్య శ్రీ పథకంలో మొండి బకాయిలు చెల్లించాలని కొద్ది రోజుల క్రితం ప్రైవేట్ ఆస్పత్రులు వైద్య సేవలను నిలిపి వేసి సమ్మె బాట పట్టాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. బకాయిలను వెంటనే చెల్లిస్తే ఆరోగ్య శ్రీ సేవలు తిరిగి పునరుద్ధరిస్తామని డిమాండ్ చేస్తూ సమ్మెను మరింత ఉధృతం చేసిన సంగతి కూడా తెలిసిందే, అయితే ప్రైవేట్ హాస్పిటల్ సమ్మెపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ రెండు రోజుల క్రితం చర్చలు జరిపారు.తెలంగాణలో ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ఇవాళ భేటీ కాబోతుంది.


ప్రభుత్వ తీరు తాజా పరిస్థితి పై అసోసియేషన్ విస్తృతంగా చర్చించనున్నట్లుగా సమాచారం. ఆరోగ్య శ్రీ బకాయిల మొత్తం పద్నాలుగు వందల కోట్లు ఉంటే ప్రభుత్వం ఆరు వందల కోట్లు మాత్రమే ఉందని స్పష్టం చేయడంతో బకాయిల లెక్కలపై కూడా అసోసియేషన్ చర్చించనుంది. సెప్టెంబర్ లో రెండు వందల కోట్లు విడుదల చేస్తామన్న ప్రభుత్వ హామీపై కూడా అసోసియేషన్ చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. ఇవాళ విస్తృత చర్చల అనంతరం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది సాయంత్రంలోగా తెలిసే అవకాశముందని ప్రైవేటు ఆసుపత్రుల అసోసియేషన్ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడంతో గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, నిమ్స్ ఆస్పత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. దీంతో అయా ఆస్పత్రిలో రోగుల రద్దీ బాగా పెరిగిపోతుంది.ప్రస్తుతం బకాయిల్లో  రెండు వందల కోట్ల ను తక్షణమే విడుదల చేస్తామని మంత్రి ఈటెల హామీ ఇచ్చారు. ఇక మిగతా బకాయిల విడుదల కోసం సిఎం కెసిఆర్ తో చర్చలు జరిపి అవి కూడా త్వరలోనే విడుదల చేస్తామని ప్రైవేటు ఆసుపత్రుల సంఘానికి తెలియజేశారు. కాని మంత్రి ఇచ్చిన హామీకి ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ ఒప్పుకోలేదు.


బకాయి మొత్తం నిధులను విడుదల చేస్తేనే సమ్మె విరమిస్తామని అప్పటి వరకూ సమ్మె యథాతథంగా కొనసాగుతున్న ప్రటించారు. పెండింగ్ బకాయిలు పన్నెండు వందల కోట్లు ఉంటే అందులో రెండు వందల కోట్లు ఇస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది . ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు తమ బకాయిలకూ చాలా వ్యత్యాసం ఉందంటున్నారు ప్రైవేట్ హాస్పటల్ డాక్టర్స్. ఇప్పటి వరకు కేవలం ఇరవై శాతం బకాయిలు మాత్రమే చెల్లించారని, ఇలా అయితే తాము పేదలకు వైద్యం ఎలా చేయాలని ప్రశ్నస్తున్నారు. అంతేకాదు వీటితో పాటు ఆరోగ్య శ్రీ ఎంవోయూలో కూడా ప్రభుత్వం మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు తీరును మంత్రి ఈటల తప్పుపట్టారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో పన్నెండు వందల కోట్ల బకాయిలు ఉన్నట్లుగా చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు అన్నారు. కేవలం ప్రభుత్వం ఆరు వందల కోట్లు మాత్రమే బకాయి ఉందని అవి కూడా ఒకే సారి కాకుండా దశల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. బకాయిల పేరుతో ఆరోగ్య శ్రీ సేవలను నిలిపి వేయడం సరికాదు అన్నారు.


అయితే ప్రైవేట్ ఆస్పత్రుల వాదన మరోలా ఉంది. పేద, బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీ పథకాన్ని తమ దుర్వినియోగం చేయడం లేదని ప్రైవేటు ఆసుపత్రుల అసోసియేషన్ సభ్యలు వాదిస్తున్నారు. పేదలకు తాము నాణ్యమైన వైద్యాన్ని అందించి వారి ప్రాణాలను కాపాడుతున్నామని చెబుతున్నారు. నలభై ఐదు రోజుల్లో చెల్లించాల్సిన డబ్బులు నాలుగు వందల యాభై రోజులైనా చెల్లించక పోవడం వల్లే పధ్నాలుగు వందల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి అని చెప్తున్నారు. ఎక్కడా నకిలీ బిల్లులు,తప్పుడు బిల్లులు లేవంటున్నారు. ప్రభుత్వం తమను అర్ధం చేసుకుని పెండింగ్ బిల్లులు వెంటనే శాంక్షన్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు ఆసుపత్రుల అసోసియేషన్ సభ్యులు విజయ భాస్కర్ విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ప్రభుత్వం చెప్తున్న ఎనిమిది వందల కోట్ల బకాయిలు నిజమా, లేక ప్రైవేట్ ఆస్పత్రులు చెప్పినట్లుగా పద్నాలుగు వందల కోట్ల బకాయిలు నిజమా అనేది ఇవాళ్ళ చర్చల్లో తెలాల్సిన విషయం.


మరింత సమాచారం తెలుసుకోండి: