భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సాహో మూవీ పై ప్రేక్షకలోకం లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని వారంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాధారణ ప్రేక్షకుల మాదిరిగానే తాను కూడా సాహో చిత్రం కోసం ఎదురు చూస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్ తెలిపారు . బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ హీరోగా యువి క్రియేషన్స్ 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెర కు ఎక్కిస్తున్నారు . ఈ చిత్రం లో ప్రభాస్ కు జోడిగా శ్రద్ధ కపూర్ నటిస్తోంది .
సాహో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని లోకేష్ ఆకాంక్షించారు. అంతేకాదు ఈ సినిమాను టిడిపి కార్యకర్తలంతా చూడాలని అయన పిలుపునిచ్చారు. లోకేష్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. టిడిపి కార్యకర్తలంతా ఈ చిత్రాన్ని చూడాలని పిలుపునివ్వడం వెనుక ఏదో మతలబు ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల ఒక వెబ్ సైట్ తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పనితీరు బాగా ఉందని ప్రశంసించారు . రాజకీయాలు తనకు పెద్దగా తెలియదని కానీ, సీఎం జగన్ ఏపీ అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని ఆయన అన్నారు.
సీఎం జగన్ పనితీరును ప్రభాస్ మెచ్చుకోవడాన్ని టిడిపి వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనితో టిడిపి వర్గాలు ఈ చిత్రం పై నెగిటివ్ ప్రచారం చేస్తారని ఒక వెబ్ సైట్ రాయడాన్ని లోకేష్, ఈ సందర్బంగా ప్రస్తావిస్తూ, ఇంత దిగజారి వార్తలు రాయడం సరికాదని మండిపడ్డారు. ప్రభాస్ చిత్రం హిట్ కావాలని ఆకాక్షించడం ద్వారా లోకేష్ , యంగ్ రెబల్ స్టార్ అభిమానులను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేసినట్లు కన్పిస్తోంది .