మీడియాను ఎలా మేనేజ్ చేయాలన్నది చంద్రబాబుకు తెలిసినట్లుగా ఎవరికీ తెలియదు. ఆయన చక్కగా లోకల్ మీడియా, నేషనల్ మీడియాని ఒంటి చేత్తోనే శాసిస్తాడు. బాబు ఢిల్లీ వెళ్తే మీడియాకు పండుగే. ఆయన వెంటే తిరుగుతారు. ఆలాంటి మేనేజ్మెంట్ చంద్రబాబుది. బాబు ఓడిపోవచ్చు కానీ మీడియాలో ఆయన ప్రమేయం, పెత్తనం అలాగే కొనసాగుతున్నాయి. ఫలితంగా నేషనల్ మీడియాలో ఎక్కువగా వైసీపీకి వ్యతిరేకంగానే న్యూస్ వస్తోంది.
ఏపీలో అయితే సాక్షి వైసీపీకి జగన్ కి అండగా ఉంది. అదే జాతీయస్థాయిలో జగన్ కి అండగా నిలిచే మీడియా ఏదీ ఇప్పటికైతే గట్టిగా లేదు. దీని వల్ల అన్నీ ప్రతికూల వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలోని ప్రభుత్వాలు అవే బలంగా నమ్ముతాయి. దాంతో మోడీ వద్ద జగన్ పలుకుబడి కూడా సన్నగిల్లే ప్రమాదం ఏర్పడింది. ఏపీలో ఏదో జరిగిపోతున్నట్లుగా చిలవలు పలవలు వండి వార్చే మీడియా వల్ల అనర్ధాలు అన్నీ ఇన్నీ కావు.
దానికి చెక్ పెట్టేందుకు జగన్ నిర్ణయించుకున్నారు. జాతీయ స్థాయిలో గట్టిగా మీడియా సంబంధాలను నెలకొల్పేందుకు ఆయన ప్రభుత్వపరంగా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ ని జగన్ జాతీయ మీడియాను కో ఆర్డినేట్ చేసేందుకు ప్రభుత్వం తరఫున సలహాదారుగా నియమించారు. దేవులపల్లి అమర్ కి జాతీయ స్థాయిలో మీడియారంగంలో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన అనేక పోరాటాలు కూడా జర్నలిస్టుల తరఫున చేసారు.
అదే విధంగా ఆయన జాతీయ స్థాయిలో యూనియన్లలో పదవులు కూడా నిర్వహించారు. ఇపుడు దేవులపల్లి అమర్ ని జాతీయ మీడియాతో సంబంధాలను నెలకొల్పడంతో పాటు, అంతర్ రాష్ట్ర సంబంధాలను చూసేందుకు కూడా ప్రభుత్వం తరఫున నియమించారు. ఆయన పదవిలో జగన్ ముఖ్యమంత్రిగా ఉండే అయిదేళ్ళు ఉండేలా ఆదేశాలు జారీ చేయడం విశెషం. మొత్తానికి సాక్షి మీడియా ద్వారా జగన్ వాదనను, వాయిస్ ని బలంగా వినిపించిన అమర్ కి జగన్ తగిన న్యాయం చేయడమే కాకుండా పెద్ద బాధ్యతనే భుజాల మీద ఉంచారు. దీన్ని అమర్ కూడా విజయవంతంగా నెరవేర్చగలరని అంతా ఆశిస్తున్నారు.