మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న నూతన ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి కి ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త షరతు పెట్టారనే ప్రచారం పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది . గుత్తాను కేబినెట్లోకి తీసుకోవాలంటే , త్వరలోనే జరుగనున్న ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కండిషన్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టారని చెబుతున్నారు . పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనసభ్యుడి గా ప్రాతినిధ్యం వహించిన హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి అయన రాజీనామా తో త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి . ఈ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ , గుత్తా భుజస్కందాలపై పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి .
హుజూర్ నగర్ లో పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే గుత్తాను మంత్రివర్గంలోకి తీసుకుంటారని లేకపోతే లేదన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డిని హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. అయినా గుత్తా విముఖత వ్యక్తం చేయడంతో, కాదనలేక మరొకరికి కేసీఆర్ అవకాశాన్ని కల్పించారు . 2014 లోక్ సభ ఎన్నికల్లో నల్లగొండ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు . ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి పోటీ చేసేందుకు కూడా విముఖత ప్రదర్శించారు.
రాష్ట్ర మంత్రివర్గం లో స్థానం దక్కించుకోవాలన్న లక్ష్యం తోనే ఆయన ఎంపీ గా పోటీ చేసేందుకు విముఖత ప్రదర్శించారన్న విషయం బహిరంగ రహస్యమే . ఎంపీ గా పోటీ చేసేందుకు గుత్తా విముఖత చూపడం తో ఆయన కు ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తానని ఎన్నికల ముందే కేసీఆర్ ప్రకటించిన విషయం తెల్సిందే . దాంతో అందరూ గుత్తా కు మంత్రి పదవి ఖాయమని భావిస్తున్న తరుణం లో కేసీఆర్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి .