జగన్, అమరావతిని ముంచడానికి ఏకంగా వరదను తీసుకొచ్చారని చమత్కరించారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. వరద ప్రకృతి వైపరీత్యం కాదని, ప్రభుత్వ వైఫల్యంతోనే వరదలు వచ్చాయన్నారు. మూడు రోజులు సాగర్‌లో నీటిని నిలిపే ఒక్కసారిగా వదిలారని, మూడు టీఎంసీలు ఉండే ప్రకాశం బ్యారేజీలో 4 టీఎంసీలు ఉంచారన్నారు. రాజధానిని ముంచాలనే ప్రభుత్వం కుట్రని, కృష్ణా నదికి వరదలేమీ కొత్తకాదన్నారు. ఫ్లడ్ మేనేజ్‌మెంట్ ప్రభుత్వానికి చేతకాలేదని, ఐదారు లక్షల క్యూసెక్కుల నీటిని మేనేజ్‌ చేయడం పెద్ద కష్టం కాదన్నారు. ఉద్దేశపూర్వకంగానే వరదల్ని తీసుకొచ్చారని, లంక, పంటల్ని ముంచేశారని మండిపడ్డారు.


గుంటూరు టీడీపీ ఆఫీసులో కృష్ణా నది వరదలపై చంద్రబాబు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రకాశం బ్యారేజీలో నీళ్లు తన నివాసం దగ్గరకు రావాలనే కుట్ర పన్నారని చంద్రబాబు ఆరోపించారు. తర్వాత మళ్లీ నోటీసుల పేరుతో డ్రామాలాడారని మండిపడ్డారు. కరకట్టపై ఏ కట్టడానికి నోటీసులు ఇవ్వకుండా కేవలం తన ఇంటికి మాత్రం నోటీసులు ఇచ్చారన్నారు. తర్వాత అనుమతి లేకుండా ఇంటిపైకి డ్రోన్ కెమెరా పంపారని కోపించారు. తాను ఉంటున్న ఇంటిని ముంచడం కోసం, లంక గ్రామాలన్నింటినీ ముంచారని ఆరోపించారు.


వరదలు వచ్చే సమయానికి రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ ఖాళీగా ఉన్నా, వరదల్ని నియంత్రించే అవకాశమున్నా ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ చేయలేకపోయారని ఆరోపించారు. తన ఇంటిని ముంచే కుట్రతో ప్రజలను నిండా ముంచారన్నారు చంద్రబాబు. రాజధానిని వరద నీటితో ముంచాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని.. వరదలు వచ్చాయని రాజధానిని మారుస్తారా అంటూ ప్రశ్నించారు. ఈ వరదలతో మొత్తం 53 వేల ఎకరాల భూమి వరద ముంపునకు గురైందని, రైతులకు పూర్తి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే వరద బాధితులకు నెలకు సరిపడా రేషన్‌ సరకులు, దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం ఇవ్వాలన్నారు.


జగన్ సర్కార్ తెలంగాణతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతోందని, మరి సముద్రంలో వృధాగా పోయే నీళ్లను పోతిరెడ్డిపాడుకు మళ్లిస్తే తెలంగాణ కృష్ణా వాటర్ బోర్డుకు ఎందుకు ఫిర్యాదు చేసిందని ప్రశ్నించారు చంద్రబాబు. తెలంగాణ ఫిర్యాదు సంగతి వైసీపీ సర్కార్ తెలియదా?దీనిపై ఏం సమాధానం చెబుతారన్నారు. ఇక ఈ జగన్ ఆఖరకు ఏదోలా ఆంధ్ర రాష్ట్రాన్ని పొరుగు రాష్ట్రానికి తాకట్టు పెట్టేలా వున్నారని, ఎద్దేవా చేసారు. ఆంధ్ర ప్రజలు ఇప్పటికైనా మేలుకోవాలి అని విజ్ఞప్తి చేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: