ఏపీలో ఎట్ట‌కేల‌కు అధికారంలోకి వ‌చ్చిన వైసీపీలో అల‌జ‌డి ప్రారంభ‌మైంది! ప‌ట్టుమ‌ని జ‌గ‌న్ పాల‌నకు 100 రోజులు కూడా నిండ కుండానే అటు  కేంద్రం నుంచి ఇటు రాష్ట్రంలోని విప‌క్షాల నుంచి కూడా తీవ్ర‌స్థాయిలోవిమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. జ‌గ‌న్ తీసుకుంటు న్న నిర్ణ‌యాల‌ను ప్ర‌శ్నించేవారు.. త‌ప్పుబ‌ట్టేవారు, స‌వాలు చేసేవారు కూడా ఎక్కువ‌య్యారు. ముఖ్యంగా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మై న పోల‌వ‌రం, రాజ‌ధాని నిర్మాణం, పీపీఏలు, ఒప్పందాల పునః స‌మీక్ష‌, రివ‌ర్స్ టెండ‌రింగ్ వంటి కీల‌క నిర్ణ‌యాల‌పై ఇంటా బ‌య‌టా స‌హా అంత‌ర్జాతీయంగా కూడా తీవ్ర విమ‌ర్శ‌నాస్త్రాలు ఎదుర‌వుతున్నాయి. 


అది కూడా వైసీపీ అధినేత జ‌గ‌న్ రాష్ట్రంలో లేని స‌మ‌యంలో, ఆయ‌న అమెరికాకు వెళ్లిన స‌మ‌యంలో ఇలాంటి వ్యాఖ్య‌లు, విమ‌ర్శ‌లు రావ‌డం పార్టీని, ప్ర‌భుత్వాన్ని కూడా అయోమ‌య స్థితికి నెడుతోంది. అదే స‌మ‌యంలో అన్న క్యాంటీన్ల తొల‌గింపు, తెల్ల రేష‌న్ కార్డుదారుల‌కు ప‌ల్స్ స‌ర్వే పేరుతో లింకు పెట్టి కార్యాల‌యాల చుట్టూ తిప్ప‌డం, ఇసుక విధానాన్ని ప్ర‌క‌టించ‌కుండా తాత్సారం చేయ‌డం వంటివి నిజంగానే ప్ర‌జ‌ల్లోనూ ఒకింత ప్ర‌భుత్వంపై అస‌హ‌నం వ్య‌క్తం చేసేలా చేస్తున్నాయి. ఇక‌, యాదృచ్ఛికంగా జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న స‌మ‌యంలోనే రాష్ట్రంలో రెండు న‌దులు గోదావ‌రి, కృష్ణాలు ఉప్పొంగాయి. ఫ‌లితంగా జిల్లాల‌కు జిల్లాలు మునిగిపోయాయి. 


దీంతో రాష్ట్రంలోని ప్ర‌ధాన విప‌క్షం టీడీపీ స‌హా బీజేపీ నేత‌లు ఉక్క ఉదుటున జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌రి ఇలాంటి స‌మ‌యంలో ముఖ్యంగా జ‌గ‌న్ రాష్ట్రంలో లేని స‌మ‌యంలో విప‌క్ష నాయ‌కులు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టే నాయ‌కులు వైసీపీలో ఏ ఒక్క‌రూ క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. నిజానికి టీడీపీ క‌న్నా కూడా వైసీపీలోనే ఫైర్ బ్రాండ్ నాయ‌కులు ఉన్నారు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌తిప‌క్షాన్ని ఒక్క బిగిన ఇరుకున పెట్టిన ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఉన్నారు. అయితే, ఇప్పుడు కీల‌క‌మైన స‌మ‌యంలో అందునా జ‌గ‌న్ రాష్ట్రంలో లేని స‌మ‌యంలో వీరంతా ఏం చేస్తున్నార‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. 


ఒక్క‌రంటే ఒక్క‌రూ ప్ర‌తిప‌క్షాల‌కు కానీ, కేంద్రానికి కానీ జ‌వాబు ఇచ్చిన  ప‌రిస్తితి ఎక్క‌డా క‌నిపించ‌లేదు. బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, రోజా, అంబ‌టి రాంబాబు, వాసిరెడ్డి ప‌ద్మ, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి వంటి వారు ఏపీలోనే ఉన్నా.. ఏ ఒక్క రూ కూడా జ‌గ‌న్‌పై జ‌రుగుతున్న దాడిని ఖండించిన పాపాన పోలేదు. పైగా ఎదురు దాడి కూడా చేయ‌లేక పోయారు. దీంతో ఇదే అవ‌కాశం అని భావించిన ప్ర‌తిప‌క్షాలు ప్ర‌భుత్వంపై ఏక‌ధాటిగా విమ‌ర్శ‌లు గుప్పించాయి. 


ట్ర‌బుల్ షూట‌ర్లు ఇలా.. వ్య‌వ‌హ‌రిస్తే.. ఇక‌, కేంద్రంలో కీల‌కంగా చ‌క్రం తిప్పుతున్న పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌యసాయి రెడ్డి, రాష్ట్రంలో చ‌క్రం తిప్పుతున్న బొత్స స‌త్య‌నారాయ‌ణ వంటివారు జారిన మాట‌లు మంటలు రేపాయి. రివ‌ర్స్ టెండ‌రింగ్ స‌హా న‌వ‌యుగ సంస్థ‌ను పోల‌వ‌రం నుంచి త‌ప్పించ‌డం వెనుక త‌మ పాత్రే కాద‌ని, కేంద్రానికి, ప్ర‌ధాని కార్యాల‌యానికి అన్నీ చెప్పి చేశామంటూ.. విజ‌య‌సాయి చెప్పిన మాట‌.. రాజ‌కీయంగా దుమారం రేపింది. దీంతో రాష్ట్రంలోని బీజేపీ రెచ్చిపోయింది. దీనిపై పీఎంవో ఏకంగా వివ‌ర‌ణ కోరిన‌ట్టు వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఇదే విష‌యంపై ప్ర‌ధాని కూడా ఆరా తీసిన‌ట్టు స‌మాచారం. 


మ‌రోప‌క్క‌, రాజ‌ధాని విష‌యంపై అక్క‌డ వ‌ర‌ద నేల‌ల‌ని, ల‌క్ష ఖ‌ర్చ‌య్యే ప‌నికి రెండు ల‌క్ష‌లు ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంద‌ని, ఇలాంటి చోట రాజ‌ధానా? అంటూ బొత్స చేసిన న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు మ‌రింత దుమారం రేపాయి. ఒక‌ప‌క్క ప్ర‌తిప‌క్షాల దాడికి దీటైన స‌మాధానం ఇవ్వ‌లేక స‌త‌మ‌త‌మైన సంద‌ర్భంలో పార్టీలోని కీల‌క నేత‌లే ఇలా వ్యాఖ్యానించి ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెడితే.. ప‌రిస్థితి ఏంట‌నే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది. దీనిపై జ‌గ‌న్ ఎలా రియాక్ట్ అవుతారో ఒక‌టి రెండు రోజుల్లో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: