మాస్ ఫాలోయింగ్ పెంచుకుందామని రొటీన్ సినిమాలను చేస్తూ వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్.. ఈ సారి మాత్రం క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. ఇంతవరకు సరైన విజయాన్ని అందుకోలేకపోయిన ఈ హీరో.. మొదటి సారి ఓ రీమేక్(తమిళ మూవీ రాక్షసన్)ను ఎంచుకున్నాడు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా రమేశ్ వర్మ దర్శకత్వంలో ఎ స్టూడియో బ్యానర్పై కొనేరు సత్యనారాయణ నిర్మించిన చిత్రం `రాక్షసుడు`. ఆగస్ట్ 2న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా మూడు వారాల ప్రదర్శనను పూర్తి చేసుకుని నాలుగో వారంలో అడుగుపెట్టింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...
నిర్మాత కొనేరు సత్యనారాయణ మాట్లాడుతూ - ``రాక్షసుడు సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించింది. అలాగే పిల్లలు నుండి పెద్దలు వరకు అందరినీ సినిమా ఆకట్టుకుంటుంది. ఆడపిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రుల తీసుకోవాల్సిన జాగ్రత్తలను సందేశాత్మకంగా చూపించారు. సినిమా మూడు వారాలను పూర్తి చేసుకుని నాలుగో వారంలోని సినిమా అడుగు పెట్టింది. మరో రెండు వారాల వరకు వసూళ్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మా ఏ స్టూడియోస్ బ్యానర్పై రూపొందిన తొలి చిత్రం ఇంత పెద్ద విజయాన్ని సాధించడం ఎంతో ఆనందంగా ఉంది`` అన్నారు.
రమేశ్ వర్మ మాట్లాడుతూ - ``సినిమా కథపై నమ్మకంతో చేశాం. మా నమ్మకం ఈరోజు నిజమైంది. ఓరిజినల్ కంటెంట్లోని అంశాలను మిస్ చేయకుండా మనకు తగ్గట్టు చేశాం. అనుపమ మంచి పాత్ర చేసింది. ముందు ఈ పాత్రలో ఆమె నటించడానికి అంగీకరించలేదు. చివరకు మంచి సినిమాలో అవకాశం కోల్పోకు అని తండ్రి చెప్పిన మాటలకు కట్టుబడి నటించింది`` అన్నారు.
అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ - కొన్నిరోజులు హెల్త్ బాలేదు. తర్వాత తమిళంలో షూటింగ్లో పాల్గొనడం వల్ల సక్సెస్ మీట్కు హాజరు కాలేకపోయాను. మంచి సినిమా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కెరీర్కు ఎప్పుడూ సాయపడుతుంది. అలాంటి సినిమానే రాక్షసుడు`. ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్`` అన్నారు.